ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలోని 43,900 మంది విద్యార్ధులకు విద్యాదీవెన పథకం కింద రూ.29,44,44,873 విడుదలైంది. చిత్తూరు జిల్లా నగరిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో, ఈ మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన అనంతరం, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విద్యాదీవెన చెక్కును విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమాధికారి బి.రామానందం, వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఎం.యశోధనరావు, గిరిజన సంక్షేమాధికారి టి.చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో విద్యాదీవెన పథకం కింద ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికానికి సంబంధించి, 35,635 మంది బిసి విద్యార్ధులు, 4,033 మంది ఎస్సి, 2,391 మంది ఇబిసి, 900 మంది కాపు, 655 మంది ఎస్టి, 248 మంది ముస్లిం, 38 మంది క్రిష్టియన్ విద్యార్ధులకు మొత్తం రూ.29.44 కోట్లు జమ చేశారు.










